ఏపీని వణికిస్తున్న కరోనా.. ఒక్క రోజే 199 కేసులు

ఏపీని కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. ఆదివారం ఒక్కసారిగా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 17,695 శాంపిల్స్‌ను పరీక్షించగా 130 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆదివారం మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి (69 కేసులు) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 199 కేసులు నమోదయ్యాయి.
తాజా కేసులు కలిపితే రాష్ట్రంలో మొత్తం సంఖ్య 3,718కు చేరాయి. మరో 30 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1290కు చేరింది.

అలాగే గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 75కు పెరిగింది.

రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 810 (వీటిలో యాక్టివ్ కేసులు 508) ఉన్నాయని ప్రకటించారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన 131 మందికి వైరస్ సోకినట్లు తెలియజేశారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసి మొత్తం కేసులు 4,659కు చేరాయి. అయితే కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారితో టెన్షన్ వెంటాడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తోంది.

Flash...   విద్యార్థులకు ఉచితంగా మాస్క్‌లు.. సెర్ప్‌కు పంపిణీ బాధ్యత!