తొలి కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించిన హైదరాబాద్ సంస్థ.. గవర్నర్ అభినందనలు

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు
చేశామని ప్రకటించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం పొందిన
తొలి వ్యాక్సిన్ క్యాండిడేట్ ఇది కావడం విశేషం. అంతేకాదు హ్యూమన్ క్లినికల్
ట్రయల్స్‌కు కూడా ఈ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌కు అనుమతులు రావడం విశేషం.
ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఈ సంస్థ
వ్యాక్సిన్ తయారీ కోసం పని చేస్తోంది.
కొవాక్సిన్ పేరిట అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను జులై నెలలో మనుషులపై
ప్రయోగిస్తారు. దేశీయంగా తొలిసారిగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసిన భారత్
బయోటెక్ సంస్థకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు.
హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీకి చెందిన ఈ సంస్థ ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను డెవలప్ చేసిందని
తమిళిసై తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో మీ కృషి అభినందనీయం అని ఆమె కొనియాడారు.
కరోనా వ్యాక్సిన్ రూపొందించడం గర్వకారణమని భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణా
ఎల్లా తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం
జంతువులపై కొవాక్సిన్‌ను ప్రయోగించగా.. క్షేమమేనని తేలిందని, వాటి రోగనిరోధకశక్తి
పెరిగిందన్నారు.
దేశీయంగా తొలి కరోనా వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్.. అమెరికాకు చెందిన
విస్కాన్‌సన్ యూనివర్సిటీతో కలిసి క్లోరోఫ్లూ పేరిట ముక్కులో వేసిన వ్యాక్సిన్‌
తయారీ కోసం పని చేస్తోంది.
Flash...   Re-organisation of Districts - certain information called for