మద్యం కోసం అమ్మఒడి డబ్బులు అడిగిన భర్త హత్య

మద్యానికి బానిసైన భర్త ప్రభుత్వం ఇచ్చిన అమ్మఒడి డబ్బులు ఇవ్వాలంటూ భార్యను
వేధించాడు. దీంతో విసిగిపోయిన ఆమె నిద్రపోతున్న భర్తను కిరాతకంగా చంపేసి
పరారైంది.

టి.నరసాపురం మండలంలోని మక్కనవారిగూడెంలో బుధవారం(జూన్ 3) రాత్రి ఈ ఘటన జరిగింది.
పరారీలో ఉన్న నిందితురాలిని శుక్రవారం మధ్యాహ్నం మక్కినవారిగూడెం బస్టాండ్ వద్ద
అరెస్ట్ చేసిన చింతలపూడి పోలీసులు శనివారం ఆమెను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. సీఐ
రాజేశ్ కేసు పూర్తి వివరాలను వెల్లడించారు.

మక్కినవారిగూడెం ఉప్పరపేటకు చెందిన కఠారి అప్పారావుకు లక్ష్మితో పదిహేనేళ్ల కిందట
వివాహమైంది. వారికి ఓ కుమార్తె(14) ఉంది. కొద్ది కాలంగా మద్యానికి బానిసైన
అప్పారావు భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని తీవ్రంగా కొడుతూ ఉండేవాడు. మద్యం
డబ్బుల కోసం ఇటీవల పాడిగేదెను అమ్ముతానని బెదిరించడంతో పాటూ ప్రభుత్వం ఇచ్చిన
అమ్మఒడి సొమ్ము తనకు ఇవ్వమని ఒత్తిడి చేశాడు. భర్త వేధింపులతో విసిగిపోయిన
లక్ష్మి అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది.

ఈ నెల 3వ తేదీ రాత్రి మద్యం తెచ్చుకోమని అప్పారావుకు రూ.200 ఇచ్చింది. మద్యంలో
నిద్రమాత్రలు కలిపి భర్తకు తాగించింది. దీంతో అతడు నవారు మంచంపై నిద్రపోతుండగా
చేతులు, కాళ్లతో పాటు నడుమును మంచానికి కట్టేసింది. తాడుతో మెడకు బిగించి
చంపేసింది. ఆ తర్వాత అతడి చేతి మణికట్టుపై బ్లేడుతో కోసి, మర్మాంగంపైనా గాయం చేసి
పరారైంది. మృతుడి సోదరుడు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న
పోలీసులు శుక్రవారం నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Flash...   Effects of electronic gadgets : మెదడుపై మొబైల్ మరియు గాడ్జెట్ల ప్రభావం తెలిస్తే..