Election Code: రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తున్నారా.. జాగ్రత్త!

Election Code: రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తున్నారా.. జాగ్రత్త!

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెంటనే అమల్లోకి వచ్చింది.

ఈ క్రమంలో తాయిలాలు, నగదు పంపిణీ తదితర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా ప్రారంభించింది. నగదు, బంగారం తదితర వస్తువుల తరలింపుపై కూడా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీసులు, అధికారులు తనిఖీల్లో సరైన పత్రాలు చూపకపోతే వాటిని సీజ్ చేస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే వాటిని తిరిగి ఇవ్వవచ్చు. ఈ నేపథ్యంలో అత్యవసర వైద్యం, కాలేజీ ఫీజులు, వ్యాపారం, శుభకార్యాలు, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్నికల వేళ అభ్యర్థులకు, ఓటర్లకు సీఈవో కీలక సూచనలు

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెద్ద మొత్తంలో నగదు చెలామణి అవుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న తెలంగాణలో దాదాపు 148 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలో స్థానికంగా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ వద్ద ఉన్న నగదుకు తగిన ఆధారాలు, సర్టిఫికెట్లు తమ వద్ద ఉంచుకోవాలి. నిబంధనల ప్రకారం నగదు తీసుకెళ్లేందుకు రూ.50 వేల వరకు మాత్రమే అనుమతి ఉందని అధికారులు చెబుతున్నారు. నగదు మాత్రమే కాకుండా బంగారం, ఇతర ఆభరణాలను కూడా పెద్దమొత్తంలో తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉందని స్పష్టమవుతోంది.

రూ.50 వేల కంటే ఎక్కువ బదిలీ చేయాల్సి వస్తే అందుకు సంబంధించిన ఆధారాలను ఉంచుకోవాలి.

ఆసుపత్రి చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తంలో నగదును తీసుకెళ్తుంటే.. పేషెంట్ రిపోర్టులు, ఆసుపత్రి రశీదులు, ఇతర పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలి.

మీరు ఏదైనా ప్రయోజనం కోసం బ్యాంకు నుండి నగదు విత్‌డ్రా చేస్తే, మీరు తప్పనిసరిగా ఖాతా పుస్తకం లేదా ATM స్లిప్‌ను మీ వద్ద ఉంచుకోవాలి.

Flash...   ఎలక్షన్ కోడ్ వచ్చేసింది.. ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?

సరుకులు, ధాన్యం అమ్మితే డబ్బు కోసం బిల్లు చూపించాలి.

భూమి అమ్మితే పట్టాలు చూపించాలి.

వ్యాపారం లేదా ఇతర సేవలకు డబ్బును వినియోగించినట్లయితే, తనిఖీల సమయంలో లావాదేవీల వివరాలను అధికారులకు చూపించాలి.

ఎక్కువ నగదు లభ్యమైతే ఐటీ, జీఎస్టీ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు. సరైన ఆధారాలు చూపితేనే వాపసు ఇస్తారు.