ELECTRIC VEHICLES: జనవరి 1 నుండి EV వాహనాలు కొనే ఆ కంపెనీ ఉద్యోగులకు రూ.3 లక్షల ఆఫర్!

 జనవరి 1 నుండి EV వాహనాలు కొనే ఆ కంపెనీ ఉద్యోగులకు రూ.3 లక్షల ఆఫర్! 

2022 కొత్త క్యాలెండర్ ఏడాదిలో జేఎస్‌డబ్ల్యు గ్రూప్ తమ ఉద్యోగులకు బంపరాఫర్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు తెలిపింది. హరిత ప్రోత్సాహకాల్లో భాగంగా తమ ఉద్యోగుల కోసం JSW గ్రూప్ కొత్త ఈవీ పాలసీని ఆవిష్కరించింది. ఇందుకోసం సంస్థ భారత్‌కు చెందిన నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సినారియోస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సంస్థలతో జత కట్టింది. 

మన దేశంలో ఓ కార్పొరేట్ సంస్థ ఇలాంటి పథకాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి. ఇందులో భాగంగా విద్యుత్ ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసే JSW ఉద్యోగులు రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకాలు పొందవచ్చు. JSW కార్యాలయాలు, ప్లాంట్‌ల్లో ఉద్యోగుల కోసం ఉచిత ఛార్జింగ్ స్టేషన్స్, ప్రత్యేక పార్కింగ్ స్లాట్స్‌ను కంపెనీ ఏర్పాటు చేస్తుంది.

JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ… 2070 నాటికి జీరో కార్బన్ ఎమిషన్ అనే భారత ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా తమ ఉద్యోగులకు ఇలాంటి తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పాలసీ ద్వారా దేశంలో ఈవీ అడాప్షన్ పెరుగుతుందన్నారు.

Flash...   గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత